బంధాలు



24. బంధాలు

సమస్యఅనేది ఎదురైతేనే కాని ఆలోచన కలుగదు. ఆలోచన లేకుండా విశ్లేషణ జరుగదు. ఈనాడు ఎక్కువమందిలో కనిపించే ముఖ్యమైన సమస్య ఒంటరితనం. దాని వలన భాధ, భయం, ఆతృత, అశాంతి. ఫలితం అనారోగ్యం. ఒంటరిగా జన్మించడం ఒంటరిగా జీవించడం ఒంటరిగా గతించడం అనేది అనాదిగా జరుగుతున్నదే. అయినా ఇప్పటికాలంలో స్వేచ్ఛాజీవనంపై మోజు పెరగడంవలన, కుటుంబ వ్యవస్థలో మార్పులు ఏర్పడుతున్నాయి. చదువులు, సంపాదనలు పేరున ఆలోచించే సమయంకూడా లేనట్లున్న పరుగులవలన ఒంటరితనం ఒక జఠిలమైన సమస్యగా మరలుతోంది. 
దీనికి పెద్దా చిన్నా అనే వయస్సుతేడా కూడా కనపడటంలేదు.  దీని ప్రభావం రెండు రకాలుగా గుర్తించవచ్చు. మొదటిది ఈనాడు చూస్తున్న అనేక రోగాలు, ఆసుపత్రులు. రెండవది ఆత్మీయత లోపంవలన సరైన సంప్రదింపులు జరపలేక తాత్కాలిక ఉద్రేకాలతో  ఆత్మహత్యలు హత్యలువంటి ఉపద్రవాలు.
ఈ ఒంటరితనం న్యూనతా భావనలు సాధారణంగా ఉమ్మడి కుటుంబాలలో ఎక్కువ కలుగవు. ఆత్మీయుల అండదండలు ఉన్న కుటుంబంలో, సమాజంలో మనిషి నిర్భయంగా ఏ భాధనైనా తట్టుకోగలడు. ఆనందంగా జీవించగలడు. ఆ సాధనే జీవిత పరమావధి. తనకికూడా ఎంతోకొంత విలువ ఉందనే నమ్మకంతో ప్యక్తిజీవనం సాగుతూ ఉంటుంది.తనవిలువ శూన్యంగా ఊహించుకునే పరిస్థితి కలిగితే విరక్తి కలుగుతుంది.  సరిగ్గా అటువంటప్పుడే సరైన ఆశించిన తోడు దొరికితే జీవితేచ్ఛ తిరిగి కొనసాగుతుంది.  ఆ తోడే అప్పటికి ఆధారం తరువాత ఆత్మ బంధంగా కూడా అవుతుంది.
అలాగనేకాక ఎన్నో రకాలుగా మనం బంధాలు కలిగి ఉంటాము. శరీర ఆవిర్భావానికి ఆశ్రయమైన అమ్మ ఒక బంధం. నా అన్న ప్రేమతో చూసే నాన్న మరో బంధం. ఇలా ఎన్నో బంధాలు. ఇవి కొనసాగించడానికి కొన్నిభాధ్యతలు కూడా వహించాలి. స్వేచ్ఛ పేరుతో ఈ భాధ్యతలకు సున్నాచుట్టే ప్రయత్నఫలితమే ఒంటరితనం.  మనుషులందరిలో ఐక్యతాభావన కలుగచేసే ఆకర్షణ, ఆత్మీయతా భావనే ప్రేమ అంటే. దురదృష్టం ఏమిటంటే కేవలం ఆడ మగ మధ్య శారీరక ఆకర్షణే ప్రేమ అనుకునే ఈ నాటి దౌర్భాగ్య స్థితి.
మనిషి అభిరుచులకు ఆశయాలకు అనుగుణంగా భావాలను అర్ధం చేసుకునే బంధుత్వం కలిగి ఉండడం మహాభాగ్యం. అది జన్మబంధం అయినా, వివాహబంధం అయినా, స్నేహబంధం అయినా సరే. అది పొందలేని వ్యక్తికి జీవితం ఫేలవంగాను, నిరాసక్తతతోను గడుస్తూంటుంది. కొన్ని సందర్భాలలో ఇటువంటి స్పందన తీవ్రమయితే సున్నితమైనవారి ప్రాణానికికూడా హానికలుగవచ్చును. ఇటువంటి పరిస్థితి సాధరణంగా వార్ధక్యంలోను, కార్య సామర్ధ్యం తగ్గినవారిలోను కనిపిస్తూంటుంది.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అనే సినీకవి గీతంలోని ప్రతీ పదము మానవ అంతరంగాన్ని విశ్లేషిస్తుంది. అసలు ఈ తోడూనీడలు ఎల్లప్పుడూ సాధ్యమయ్యేవి కావు.  నిజానికి ఏ వ్యక్తికైనా తన ఆదర్శాలకు తగ్గట్టు, తననుకున్నట్టు ఉండడం తనకే ఎంతోకష్టం. అటువంటప్పుడు మరోవ్యక్తినుండి ఆశించడం సమంజసం కాదేమో. అందుకే ఆంతర్యం ఎరిగిన నిత్యము సత్యము అయిన అంతర్యామితో బంధం అభిలషనీయం. శ్రీరామ నీ నామమెంతో రుచిరా అనడంలో  అర్ధం దైవంతో బంధంలో భావనను విశదీకరించడమే తప్ప ఉప్పు, పులుపు, తీపిలాంటి రుచి అని కాదు.  రుచి మరిగితే కాని రుచి అంటే అర్ధం తెలియదు.
మళ్ళీ లౌకిక విషయాలకి వస్తే, తల్లిదండ్రుల బంధం లేకుండా జన్మ సాధ్యంకాదు.  ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నది కొన్ని బంధాలనే సూచిస్తున్నా, పుట్టుకతోటే కలిగే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఇతర రక్త సంబంధాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  కేవలం భార్యాభర్తల బంధాలేకాదు ఈ బంధాలన్నీ (Made for each other) ఒకరికోసం మరొకరు అనే అర్ధం.
బంధం ఎటువంటిదైనా జీవితావసరాలకు ఒకరిపై ఒకరు ఆధారపడినపుడు ఎపరికి వీలయినట్లు వారు అవకాశ దుర్వినియోగం చేయడం, విడాకులవంటి బంధ నాశనానికి దారితీస్తుంది. పటిష్ఠమైన సమాజ నిర్మాణంకోసం ప్రతిపాదించిన వివాహబంధాలు, కుటుంబ సంబంధాలు, కులవ్యవస్థ, పరిపాలనారంగమూ దెబ్బతినడానికి కూడా ఎవరికి వీలయినట్లు వారు చేసిన, చేస్తున్న ఈ అవకాశ దుర్వినియోగమే మూలకారణం.  వ్యక్తుల స్పృహ కేవలం శారీరక భోగాలపైనే కాక ఆత్మీయతయొక్క ఆవశ్యకత కూడా పెడితే ఒంటరితనం, ఆందోళన లేకుండా బ్రతకవచ్చు, బ్రతకనీయవచ్చు.

ఏకాగ్రత



23. ఏకాగ్రత

ఏకాగ్రత అంటే కార్యసాధనలలో ఏదో ఒక్క విషయానికి అగ్రమైన విలువనివ్వడం.  అంటే ఒకే విషయంపై ఎక్కువ శ్రద్ధ చూపించడం.  ఏకాగ్రతతో ఎటువంటి విషయాన్నైనా సాధించవచ్చు. ప్రతీజీవికి ఏకాగ్రత శక్తి ఉంటుంది. దేహాంతర్గతమైన కారణాలవలన, పరిసరాల ప్రాబల్యంవలన ఇది ఎక్కువసేపు సాగించడం కష్టమనిపిస్తుంది.  సాధారణంగా ఏకాగ్రతనే పదం కొద్దిసమయాన్ని వెచ్చించి సాధించేవాటి విషయంలోనే వాడుతూంటారు.
పూర్వం ఋషులు, రాక్షసులు కూడా ఎన్నో సంవత్సరాల కాలం ఏకాగ్రతతో తపస్సు చేసేవారని పురాణాలలో వింటూంటాము. ఋషులు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానంతో, సమూపార్జన చేసి పొందిన శక్తిని లోకకళ్యాణానికి వాడడం, రాక్షసులు పొందిన తపో శక్తితో తమ మనుగడకే ముప్పు తెచ్చుకోవడం అందరికీ తెలిసినదే. అంటే ఏకాగ్రత సాధించగలగడం పదునైన కత్తిని సాధించడంలాంటిది.  పదునైన కత్తిని వాడి ప్రాణాన్ని నిలబెట్టే చికిత్సైనా చేయవచ్చు, ప్రాణాలు తీసే అపాయమైనా కలిగించవచ్చు.
సాధారణంగా మనిషికి దేనిలో ఆనందం ఉంటుందని నమ్మకం ఉంటుందో దానిపై ఏకాగ్రత నిలుపుతో ఉంటాడు.  ధనం సంపాదిస్తే జీవితం సుఖమయం అయిపోతుందని దానికే అగ్రస్ధానం ఇచ్చేవాళ్లు చాలామంది కనిపిస్తూంటారు.పదవితోటే బ్రతుకు అని పాకులాడేవాళ్ళు కొంతమంది. శారీరక ఆకర్షణే ప్రేమ అని, అదే జీవితమని అగ్రతని ఆపాదించి ఆత్మీయులకు దూరమై అశాంతిని పొందేవాళ్ళు కొంతమంది. ఇంకా ఎన్నో రకాలైన వ్యామోహాలతో, హితం చెప్పేవారి మాటను పెడచెవిని పెట్టి తరువాత నష్టాలకు గురవుతూంటారు కొంతమంది. ఈ లక్షణాలతో సాధారణ జీవనధర్మాలను కూడా విస్మరించేవాళ్ళు కోకొల్లలుగా తయారవుతున్నారు ఈనాడు.
ప్రస్తుతానికి ధనం అనే విషయం గురించి కొంచెం విశ్లేషిస్తే... నిజానికి ధనం అనేది ఎంతో అవసరమయినదే అయినా ఒక స్ధాయిని మించి కూడబెట్టడంలో ఎన్నోసమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. డబ్బు కూడబెట్టడానికి ఆత్మీయుల ఆదరణకు కూడా నోచుకోకుండా అవిరామంగా శ్రమపడడం, దానివలన కలిగిన అనాదరణ, అశాంతితో అనారోగ్యం తెచ్చుకుని సంపాదించినది అనుభవించలేక కొంత, ఆసుపత్రులకు పోస్తూ కొంత, వృధా ప్రయాసలాగ అనిపిస్తుంది ఎన్నో జీవితాల స్థితి.
ధనంకోసం ఏకాగ్రతతో మితిమీరిన శ్రమ కొంతమంది మార్గమయితే, అవినీతి అక్రమం అన్యాయం మరి కొంతమంది మార్గంగా కనిపిస్తోంది.  దీనివలన వర్తమానంలో ఇతరులు, భవిష్యత్తులో తాము ఎన్నో రకాల భాధలు అనుభవించవలసి వస్తుందని గ్రహింపు జరగటంలేదు. మధుమేహరోగికి శరీరానికి ఎంతో అవసరమయిన చక్కెర ఎక్కువయితే ఒక సమస్య, తక్కువయితే మరొక సమస్య ఎలాగుంటుందో, అదేలాగ ధనానికి అర్ధం ప్రాముఖ్యత తెలియని మనిషికి అది ఎక్కువయినా తక్కువయినా అనేక సమస్యలుంటాయి. అనుభవంలోకి వస్తేనేగాని గుర్తించలేకపోతే మధుమేహం లాంటి ధనమేహం బారినపడి ఇబ్బందులు పడవలసివస్తుంది. ఓ రోగమయినా మరో అనుభవమయినా నాకు కలిగితేనే నమ్ముతాను అనుకోవడం వివేకం కాదేమో.
నీతి, నియమం, న్యాయం, ధర్మం, గతం, భవిష్యత్తుల గురించిన ఆలోచనలపై కూడా కొంత ఏకాగ్రత చూపిస్తే ముందు వ్యక్తికి తరువాత సమాజానికి న్యాయం జరుగుతుంది.
చంచలస్వభావమైన మనస్సును నిలకడగా ఒకే విషయానిపై ఉంచడం ఒక ప్రజ్ఞ. దేనికి అగ్రత ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవడంలో వివేకం చూపిస్తే, చాలా సమస్యలు ఉండవు.  సమస్యలు తగ్గేకొద్ది మిగిలిన సమస్యలపై మరింత ఏకాగ్రత పెట్టి సులభంగా బయట పడవచ్చు.  మనం సాధించగలిగే సమస్యను తీసుకుని సాధించినప్పుడే, జీవితం ఆసక్తికరంగా విజయవంతంగా సాగుతోందనే భావన కలుగుతుంది. మనకు సమస్యలు లేకపోతే మరొకరికి సాయంగానైనా బ్రతకవచ్చు. అందులోనున్న ఆనందానుభూతి పొందే స్థితికి చేరిన మనుషుల సమూహంతో ఏర్పడిన సమాజం సుస్థిరత కలిగి ఉంటుంది.